- బజాజ్ ఫిన్సర్వ్ రిపోర్ట్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: భారతీయ స్టాక్ మార్కెట్లు గత 18 నెలలుగా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నా, నిఫ్టీ–500 సంస్థల లాభాలు ఈ ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్లో 16 శాతం పెరిగాయని బజాజ్ ఫిన్సర్వ్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ తెలిపింది. దీని రిపోర్ట్ ప్రకారం.. ఈ సంస్థల మొత్తం అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 11 శాతం పెరిగి సుమారు రూ.36 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
నికర లాభం సుమారు రూ.నాలుగు లక్షల కోట్లుగా ఉంది. ఎబిటా విలువ సుమారు రూ.ఎనిమిది లక్షల కోట్లుగా నమోదైంది. దాదాపు 17 రంగాల్లో రెండంకెల వృద్ధి కనిపించింది. క్రెడిట్ గ్రోత్ సైతం రెండంకెల స్థాయికి చేరింది.
అయితే ఏఐ టెక్నాలజీల వల్ల ఐటీ రంగంలో ఆందోళనలు నెలకొన్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మూడు నుంచి ఏడేళ్ల బాండ్లలో పెట్టుబడులు అనుకూలంగా ఉన్నాయని బజాజ్ ఫిన్సర్వ్ రిపోర్ట్ పేర్కొంది.
